రైతు సంక్షేమం కాంగ్రెస్తోనే సాధ్యం: ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి
రైతు సంక్షేమం కాంగ్రెస్తోనే సాధ్యం: ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్నగర్ (ఆర్కే న్యూస్ ప్రతినిధి):
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన వైఖరి మార్చుకోవాలని, రాజకీయాల్లో హుందాతనం ఎలా ఉండాలో ఇటీవల ఎన్నికల్లో గెలిచిన విజయ్ను చూసి నేర్చుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి హితవు పలికారు. బుధవారం సిఎల్పీ కార్యాలయంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
కేటీఆర్పై ఘాటు విమర్శలు:
రైతు సంగ్రామ సభ పేరుతో రైతుల సమస్యల గురించి కాకుండా, కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిట్టడానికే సభను ఉపయోగించుకున్నారని యెన్నం మండిపడ్డారు. కేసీఆర్ తన కొడుకుకు కేవలం బూతులు మాట్లాడటమే నేర్పించారని ధ్వజమెత్తారు. "ప్రాంతీయ పార్టీలు సిద్ధాంతాలతో బతకాలి తప్ప, అరాచకాలు చేస్తే కాలగర్భంలో కలిసిపోతాయని చరిత్ర చెబుతోంది. వారసత్వ రాజకీయాలకు కాలం చెల్లింది" అని స్పష్టం చేశారు. అడ్డగోలుగా విమర్శలు కొనసాగిస్తే వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ సిరిసిల్లలో ఎమ్మెల్యేగా కూడా గెలవలేరని జోస్యం చెప్పారు.
అంకెలే సాక్ష్యం - రైతు రుణమాఫీపై స్పష్టత:
గత ప్రభుత్వం పదేళ్ల కాలయాపన చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుందని యెన్నం వివరించారు.
రుణమాఫీ: రూ. 21 వేల కోట్ల రుణమాఫీ ద్వారా 25 లక్షల 35 వేల మంది రైతులకు ఒకేసారి లబ్ధి చేకూర్చాం.
బడ్జెట్: గతంలో నెలకు రూ. 2,500 కోట్లు ఖర్చు చేస్తే, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 5,200 కోట్లు ఖర్చు చేస్తోంది.
బోనస్: రైతు కూలీలకు రూ. 3,000 కోట్లకు పైగా బోనస్ అందించాం.
గతంలో లక్ష రూపాయల రుణమాఫీని నాలుగు విడతలుగా ఇచ్చి రైతులను ఇబ్బందులకు గురిచేసిన చరిత్ర బీఆర్ఎస్దని ఆయన గుర్తుచేశారు.
సంక్షేమ పథకాలపై మహిళల హర్షం:
మహబూబ్నగర్ జిల్లా సహా రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న ఉచిత బస్సు సౌకర్యం మారుమూల గ్రామాల్లోని మహిళలకు ఎంతో ఆసరాగా నిలుస్తోందని యెన్నం పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన అన్వేష, ఆదిలాబాద్కు చెందిన ప్రగతి వంటి ఇంటర్మీడియట్ విద్యార్థినులు మంచి మార్కులు సాధించడానికి ఈ ఫ్రీ బస్సు పథకమే కారణమని స్వయంగా చెబుతున్నారని వివరించారు.
అభివృద్ధి పథంలో తెలంగాణ:
భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం, స్కిల్ యూనివర్సిటీ ప్రారంభం వంటి చర్యలతో రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నామని ఆయన తెలిపారు. ముక్కు నేలకు రాసినా బీఆర్ఎస్ నేతల అబద్ధపు మాటలను తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరని యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.